వైరాగ్యం.
వైరాగ్యం అనేది ప్రధాన భూమిక ముముక్షువులకి. అన్నీ వదిలెయ్యడం అనేది లౌకికర్ధం. వదిలెయ్యడంలోని అర్ధం తెలియడం వైరాగ్యం . తాడుని చూసి పాము అనుకున్నా,లేదా ఏదైనా నీడచూసి పాము అనుకున్నా, జ్ఞానం వల్ల మాత్రమే భయం పోతుంది. మళ్ళీ ఎన్నిసార్లు చూసినా మరి భయం కలగదు .అలానే ముత్యపు చిప్పలోని వెండి.
చూడడానికి రెండు వెలుగులు కావాలి . బయటివెలుగు,మనసు కళ్ళు వలన మనదృష్టి. ఈ రెంటితో
భయం పోయింది.భౌతిక ప్రపంచము ఈ తాడు వంటిదే. కానీ పరమాత్మ విషయం తెలుసుకోడానికి ఈ వైరాగ్యం ఒకటి సరిపోదు .ఈ జ్ఞానం ఏమిటో తెలియాలి. ఎందుకంటే రెండు వెలుగులు భౌతిక వస్తువులు
చూడడానికి పనికివస్తాయి. కానీ జ్ఞాన అజ్ఞానాలకు ఆవల పరమాత్మ.
గదిలోఉన్న దీపం వస్తువులను ప్రకాశింప చేస్తుంది. కానీ దీపాన్ని ఎవరూ ప్రకాశింప చెయ్యలేరు.
ప్రకాశంలోని వస్తువులు,దీపముకూడా తెలియడం,అలానే ప్రకాశం లేనప్పుడు అవి తెలియక పోవడం కూడా
మనకు తెలుస్తోంది.అంటే జ్ఞానము అజ్ఞానము కూడా తెలుస్తున్నాయి.పరకాశిస్తున్న వస్తువులు ,పై ఉదాహరణ
లోని తాడు ,పాము వంటివి. అంటే అస్థిత్వం లేదు . ఏది ఒకసమయంలో మాత్రమే ప్రకాశిస్తుందో ,అది
నిజానికి లేదు .రెండు వెలుగులు లేకపోతె సృష్టి మృగ్యం. మొదలు తుది ఉన్నది భ్రాంతి. ఈ రెండు లేనిది పరమాత్మ తత్త్వం ఒకటే. జ్ఞానాన్ని అజ్ఞానాన్ని ప్రకాశింప చేస్తున్న తాను మాత్రమే నిజం. ప్రకాశింప బడుతున్న
శరీరం అజ్ఞానం . శరీర జ్ఞానం కలిగిఉన్న తాను పరమాత్మ.