11, జులై 2016, సోమవారం

నామరూపాలు

 
 నామరూపాలు 
       నామరూపాలు,ఖేదాన్ని కాక మోదాన్ని ప్రసాదించే విద్య మోక్షవిద్య . సర్వమ్ విష్ణు మయం జగత్ . కనుక 
నామరూపాలు కూడా విష్ణు రూపమే . భగవంతునిచేత రూపొందించబడిన విగ్రహాలే నామరూపాలు . వాటికి పరంపరా 
ప్రాప్తిత కర్మల ఫలాలతో కలిపి చూడక ,చైతన్యవంతమైన విగ్రహాన్ని మాత్రమే చూసి చేసే సేవ ,మాధవసేవ . దీనివలన 
క్రమంగా నామరూపాలు చైతన్యమనే ఎరుక బలపడుతుంది . దీనికి మానవ సేవ పేరుతో చందాల అవసరం లేదు . తాను 
ప్రపంచంలో తనుకాక ఎవరితో మెలిగినా అదే స్పృహ కలిగి ఉండాలి . దీనివల్ల క్షమాది షట్క సంపత్తి ఏర్పడుతుంది . దీనివలన మానవ సంబంధాలు బలపడతాయే కానీ చెదిరిపోవు . అంతే కానీ ,నామరూపాలతో ప్రాప్తిత కర్మను కలిపి చూడడం వలన కామక్రోధాది దుర్లక్షణాలు కలుగుతాయి . కానీ కర్మతో ముడిపడిన అనుబంధాలు ధర్మబద్ధంగా అనుసంధానం చేసినపుడు మాత్రమే జీవనం సార్ధకత పొందుతుంది .
          నామరూపాలు ,ధ్యాన సమయంలో తన ఉనికిలో నిలువనివ్వక ,మనో సామ్రాజ్యం ఆహ్వానిస్తుంది . ఎప్పుడూ
ఖాళీ లేకుండా పరుగులు తీసే అలవాటు వల్ల ,ధ్యానం అనగానే ఆ తీరికని వాడుకోడానికి మనస్సు ఎంతో ఉత్సాహంగా
తన ప్రతిభను ప్రదర్శించి ,మాయలేడిలా భ్రమ పెడుతుంది . సీతలా శరీర పర్యంతంగా తనను భావించే అహం ,లేడివెనుకే
చైతన్యాన్ని పంపుతుంది . మిగిలినది అందరి ఎరుకలోని ,ధ్యానం అనే స్ఫురణ జారిపోవడమే జరుగుతుంది .దీనికి తోడుగా ధర్మ బద్ధమైన జీవన విధానం ,శరణాగతి ,ప్రపత్తి అనే మూడు ఆయుధాలతో ,దశానన చెరనుండి ,పరమాత్మ కృపతో
రామపత్నిగా ,రాజపత్నిగా మోక్షాన్ని జీవులు పొందవచ్చు .
      సీత ఎప్పుడు రామునిదే . అలానే సృష్టి ఎప్పుడూ పరమాత్మదే . సృష్టికి పూర్వము ,సృష్టిగాను ,సృష్టినుండి లయించిన తర్వాత కూడా . యిలా మూడుగా గాని ,జీవాత్మ పరమాత్మ యిలా రెండుగా గాని అనిపించడమే మాయ. దీనికి పెద్దలు
చూపిన ఉపమానము ,ఘట లేదా మఠ ఆకాశము . ఇవి తయారైనప్పుడు ఆకాశం ఏకమే . అవి అలా ఉన్నప్పుడూ ఆకాశమే ,కుండ విరిగినా ,మఠం కూలినా ఉన్నది ఆకాశమే . నిద్రలో ఉన్న వారికి వారు లేరనే అర్ధం లేదు . ఉన్నారు కానీ
తెలియడం లేదు . మెలకువలో తాను ఉన్నాననే స్పష్టత ఉన్నది . మెలకువ లోని స్పష్టత మాయతో కూడి ఉన్నది . దీన్ని మాయా ముక్తం చేయడం కర్తవ్యం . మాయలేడి వెంట వెళుతున్న చైతన్యం మనకు దొరకదు . అందుకే ధ్యానం . దీన్నే
ఆలోచనకు సాక్షిగా ఉండడం అంటారు . దీనికి తనలో విషయాన్ని తెలుసుకోవాలనే తపన ముఖ్యం . రోజులో ఎన్ని సార్లయినా ,ఎవరు ఆలోచిస్తున్నారు ?వింటున్నారు?చూస్తున్నారు ?అని మనసుని నిలిపితే ,మోనమే సమాధానం .
కానీ తెలుసుకుంటున్న వారుగా అక్కడ ఉన్నారు . మోనానికి అర్ధం ఉండడం . అదే ఉనికి . కానీ ఉన్నది శరీర పర్యంత
వ్యక్తి కాదు . పరమాత్మ . అక్కడే ఉంటే పరమాత్మ . దేహంతో తాదాత్మ్యం చెంది చెప్పినా ,విన్నా ,ఏం చేసినా జివి .
దీన్నే మోన వ్యాఖ్య అంటారు . మోనంలో ఉన్న చైతన్యం పరమాత్మ మాత్రమే . ఆలోచన మొదలైన క్షణం సృష్టి . సృష్టి
లేకున్నా ఉనికి ఉన్నది . కానీ ఉనికి లేక సృష్టి లేదు .దీన్ని శంకరాచార్యులవారు కోహం అని ప్రశ్నించారు . దీన్నే
రమణులు ఎవరు నేను ?అన్నారు .